అశ్వాపురం మండలం నెల్లిపాకలో కలకలం.. గోదావరి ఒడ్డున క్షుద్రపూజల ఆనవాళ్లు..!

freelancer Journalist Chirra  : అశ్వాపురం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలోని గోదావరి నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించినట్లు కనిపించిన ఆనవాళ్లు గ్రామంలో కలకలం రేపాయి.  స్థానికుల కథనం ప్రకారం, గోదావరి ఒడ్డున ఇసుకలో గుండం గీసి, దాని చుట్టూ మేకులు కొట్టి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పూజలు నిర్వహించినట్లు గుర్తించారు. అంతేకాకుండా నాలుగు కోళ్లతో పాటు ఒక మేకను బలి ఇచ్చి అక్కడే వదిలివెళ్లిన దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇలాంటి ఘటనలు గ్రామంలో తొలిసారిగా కనిపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పిల్లలు, మహిళలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు భయపడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గోదావరి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా రాత్రి వేళల్లో పోలీసు నిఘా పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, క్షుద్రపూజలు నిర్వహించిన వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి  చేస్తున్నారు. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? నిజంగానే క్షుద్రపూజలు నిర్వహించారా? లేక మరేదైనా ఉద్దేశంతో ఈ ఆనవాళ్లు వదిలివెళ్లారా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.  గమనిక: ప్రస్తుతం ఈ ఘటనపై గ్రామస్తుల వాదనలు, అక్కడ కనిపించిన ఆనవాళ్ల ఆధారంగానే సమాచారం వెలువడింది. అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *