అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ
మహానది, భద్రాద్రి కొత్తగూడెం నవంబర్23, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ శనివారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. తొలుత స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన, పోలీస్ సిబ్బందికి కేటాయించిన క్వార్టర్స్ స్థలాన్ని కూడా పరిశీలించారు.స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించిన ఎస్పీ, వాటి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఏవైనా సందేహాలు తలెత్తినప్పుడు, ఉన్నతాధికారుల సలహాలు తీసుకొని న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ కీలకమైన ప్రాంతమని పేర్కొన్న ఎస్పీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకోవాలని, అలాగే కోడిపందాలు, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో సమావేశమై, వారి పనితీరు గురించి వర్టికల్స్ వారీగా తెలుసుకున్నారు. కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని అధికారులకు సూచించిన ఎస్పీ, విధులపరంగా ఎదురయ్యే సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ కరుణాకర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సైలు యాయాతి రాజు, శివరామకృష్ణ, దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

